తొలి టీ20లో భారత్ విక్టరీ..
200 పరుగుల టార్గెట్ను శ్రీలంక ముందుంచిన రోహిత్ సేన.. శ్రీలంకను 150 పరుగులలోపే కట్టడి చేసింది.
- By Admin --
- Thursday, 24 Feb, 2022
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా విక్టరీని నమోదు చేసింది. 200 పరుగుల టార్గెట్ను శ్రీలంక ముందుంచిన రోహిత్ సేన.. శ్రీలంకను 150 పరుగులలోపే కట్టడి చేసింది. ఆరు వికెట్లు కోల్పోయిన లంక సేన.. పరుగుల మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, వెంకటేశ్ ఐయ్యర్ రెండు వికెట్లు తీయగా.. చాహల్, రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో వికెట్ తీశారు. శ్రీలంక బ్యాట్స్మెన్ అసలంక హాఫ్ సెంచరీ సాధించినా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కరుణరత్నే 21, చమీరా 22 పరుగులు సాధించారు.
ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా బ్యాట్స్మెన్ అదరగొట్టారు. టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మెరుపు బ్యాటింగ్ తో శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపాడు. ఇషాన్ షాన్ దార్ ఇన్నింగ్స్ తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. అతనికి తోడుగా శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57 పరుగులు; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (32 బంతుల్లో 44 పరుగులు; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. శ్రీలంక (Sri Lanka) బౌలర్లలో లహీరు కుమారా, దసున్ షనక చెరో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. కరుణరత్నే వేసిన మూడో ఓవర్లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. హ్యాట్రిక్ బౌండరీలతో లంక పేసర్పై విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో టీమిండియా మొత్తం 15 పరుగులు పిండుకుంది.
జట్టు స్కోరు 111 పరుగుల వద్ద టీమిండియాకు తొలి షాక్ తగిలింది. లహీరు కుమార్ బౌలింగ్లో రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కూడా ఇషాన్ కిషన్ తన జోరును కొనసాగించాడు. అయితే, భారీ స్కోర్ సాధించే క్రమంలో టీమిండియా 17వ ఓవర్లో ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వికెట్ కోల్పోయింది. షనక బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి జనిత్ లియనాగేకు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. అయితే, ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(Shreya Iyer) తన విశ్వరూపం చూపించాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇక ఈ మ్యాచులో రోహిత్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు. వ్యక్తిగత స్కోరు 37 పరుగులు వద్ద.. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం రోహిత్ శర్మ 3,307 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 3,299 పరుగులతో రెండో స్థానానికి పడిపోయాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3,296 పరుగులతో మూడో స్ధానానికి పడిపోయాడు.